పాలకొల్లు సెంట్రల్: ‘నియోజకవర్గంలో ఏ చిన్న విషయం జరిగినా తెలిసే మంత్రి గారికి, ఏరియా ఆస్పత్రి ప్రాంగణాన్ని డంపింగ్ యార్డుగా మారుస్తున్నా తెలియలేదనడం నమ్మశక్యంగా లేదు’ అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి నూతన భవన ప్రాంగణంలో చెత్తతో ల్యాండ్ ఫిల్లింగ్ చేయడంపై సోమవారం ఆయన ఆస్పత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ ప్రాంగణంలో లెగసీ వేస్ట్తో పాటు చెత్తను కూడా పారబోయడంతో వర్షానికి డయాలసిస్ సెంటర్ పరిసరాలన్నీ తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న అంశంపై అధికారులతో సమీక్షించే మంత్రి రామానాయుడికి ఈ విషయం తెలియదనడం విడ్డూరంగా ఉందని, నాటకాలకు స్వస్తి చెప్పి నిజాలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టర్ చేయాల్సిన పనిని మున్సిపల్ కార్మికులతో చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, శానిటరీ సిబ్బందిని అక్కడి నుంచి పంపించివేశారు. ఆస్పత్రి ఆవరణలోని చెత్తను తక్షణమే తొలగించాలని ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేకాధికారి దాసి రాజును డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి రామానాయుడు 2029లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదని ముందే గ్రహించినట్టున్నా రని అందుకే అతిగా జగన్మామస్మరణ చేస్తున్నారని గోపి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు యడ్ల తాతాజీ, కోరాడ శ్రీనివాసరావు, ఉచ్చుల స్టాలిన్, బండి రమేష్, మోర్త గిరీష్, పాలపర్తి కృపానాథ్, కర్రా జయసరిత, లోపింటి చిరంజీవి, కెల్లా దుర్గారావు, రేలంగి శ్రీనివాస్, పిల్లా శ్రీనివాసు, కొరగింజల హనుమంతురావు, జోగి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
పాలకొల్లులో వైఎస్సార్సీపీ నిరసన


