తణుకు అర్బన్: కాలేయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయికిరణ్ తెలిపారు. రోగి బి.ఇస్రాయేల్ (62) కాలేయ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరగా, వైద్య పరీక్షల అనంతరం ఆస్పత్రిలోని సీనియర్ జనరల్ సర్జరీ వైద్యుడు డాక్టర్ చక్రధర్ శస్త్రచికిత్స చేసి కాలేయంలో ఉన్న అరుదైన తిత్తిని తొలగించినట్లు వివరించారు. మత్తు వైద్యుడు డాక్టర్ శ్రీనివాసరాజు, వైద్య బృందం ఎంతో శ్రమించి ఈ అరుదైన శస్త్రచికిత్సను చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగింది. ఆషాఢ మాసం కావడంతో పాటు, తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షం కారణంగా భక్తుల రాక తగ్గింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూ లైన్లు, కల్యాణకట్ట, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద సాయంత్రం వరకు భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారికి మొక్కులు చెల్లించుకుని, దర్శించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచి, దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
తాడేపల్లిగూడెం: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు శనివారం పట్టుకున్నారు. 27వ వార్డులో ఆటోలో తీసుకెళ్తున్న 600 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదుచేశారు.


