యలమంచిలి: గోదావరిలో వరద నీరు పెరగడంతో కనకాయలంకవద్ద కాజ్వే నీట మునిగింది. గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఇంజన్ పడవలను ఏర్పాటుచేశారు. వరద ఉధృతిని పరిశీలించేందుకు జేసీ కేఆర్ కల్పశ్రీ, నరసాపురం ఆర్డీవో దాసి రాజుతో కలిసి కనకాయలంక వచ్చారు. వరద సహాయక చర్యలపై తహసీల్దార్ గ్రంధి నాగవెంకట పవన్కుమార్, ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్కు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 12 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారన్నారు. ఆదివారం మరో 15 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లంక గ్రామాల్లోని గర్భిణులు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జేసీ ఆదేశించారు. పాఠశాలలను మూసివేయాలన్నారు. గ్రామంలోని హెల్త్ క్యాంపు, పశువైద్య శిబిరాలను జేసీ కల్పశ్రీ సందర్శించారు.
కనకాయలంకలో నీటమునిగిన కాజ్వే
కనకాయలంకకు పడవపై వెళుతున్న జేసీ, ఆర్డీఓ
నరసాపురం: నరసాపురంలో వశిష్ట గోదావరి నీటిమట్టం భారీగా పెరుగుతోంది. రెండు రోజుల నుంచి నీరు పెరుగుతూనే ఉంది. శనివారం వలంధర్ రేవులో పిండ ప్రదానం షెడ్డుకు సమాంతరంగా నీటిమట్టం చేరింది. సముద్రం పోటు సమయంలో నీటిమట్టం మరింతగా పెరుగుతుంది. దీంతో భక్తులు స్నానాలకు దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో గోదావరి స్నానాలు, పిండ ప్రదానాలకు వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. పడవల రేవులో పంటు రాకపోకలను అధికారులు శుక్రవారం రాత్రి నుంచి నిలిపివేశారు. ప్రస్తుతానికి వరద పరిస్థితి అదుపులో ఉందని, అధికారులను అప్రమత్తం చేశామని నరసాపురం ఆర్డీఓ దాసి రాజు తెలిపారు.


