రెచ్చిపోతున్న మట్టి మాఫియా
ఎవ రు తరలిస్తున్నారో తెలియదు
సిబ్బందిని అప్రమత్తం చేశాం
● పంట బోదెలో తవ్విన మట్టి అమ్మకం
● సర్వే రాళ్లను తవ్విపారేస్తున్న వైనం
ఉండి: ఉండి మండలంలో పుంతలు, పంట బోదెలు కావేవీ మట్టి దోపిడీకి అనర్హం అన్నట్లుగా వుంది. మండలంలోని కలిసిపూడి పుంతలో గతంలో పూడికతీత పేరుతో పనులు నిర్వహించారు. తవ్విన మట్టిని పుంతలో వేసి ఆరబెట్టారు. ఇప్పుడు దానిపై మట్టిమాఫియా కన్నుపడింది. పొక్లెయినర్తో పాటు టిప్పర్ లారీలను సిద్ధం చేసుకుని మట్టిని తరలించుకుపోతున్నారు. పనిలో పనిగా పుంతను కూడా తవ్వేస్తున్నారు. దీంతో పుంత కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. పుంతను అనుకుని వున్న పొలాల్లో మట్టిని తవ్విన ప్రతీసారి పుంతను సరిచేస్తున్నామని చెబుతూ పుంతను కూడా తవ్వేసుకుంటున్నారు. ప్రస్తుతం పుంతలో జరుగుతున్న అక్రమ మట్టి తరలింపులో భాగంగా మట్టి తవ్వుకునే నెపంతో పుంతను కూడా తవ్వుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యంతో రెచ్చిపోతున్న వైనం
పుంతను తవ్వుకునేందుకు అడ్డుగా వున్న సర్వే రాళ్ళను తీసిపారేస్తున్నారు. రీ సర్వేలో భాగంగా సర్వే రాళ్లు పాతి సరిహద్దులు నిర్ణయించారు. అవి అడ్డే కాదు అన్నట్లు వాటిని పీకిపారేస్తూ మట్టిని తవ్వుతున్నారు. అడ్డుచెప్పేవారు లేకపోవడంతో దోపిడీదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లను అధికారులు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతూ విడిచిపెడుతున్నారు. ప్రభుత్వ అఽనుమతులు లేకుండా ప్రభుత్వాదాయానికి గండి కొడుతూ సాగుతున్న అక్రమ మట్టి రవాణాకు అధికారుల అండదండలు ఉంటున్నాయి. మట్టి అక్రమ రవాణా చేసే వాహనాలకు మైనింగ్ అధికారులు కొద్దో గొప్పో ఫైన్ విధించి వెంటనే వాహనాలను విడిచిపెడుతున్నారు.
ఇబ్బంది పడుతున్న రైతులు
ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పుంతలు, పంట బోదెలు తవ్వుకుని దోచేస్తున్నా కనీసం పట్టించుకోవడం లేదు. స్థానికంగా అధికారులు మాఫియాతో లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి అక్రమ రవాణాతో పుంత స్వరూపం మారిపోతోంది. ఇతర వాహనాలు వెళ్ళేందుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆక్వా రైతులు, వరి రైతులు పొలాలకు వెళ్ళాలన్నా, ఎరువులు, మేత తీసుకువెళ్ళాలన్నా ఒకపక్క టిప్పర్ లారీలు, మరో పక్క దిగబడిపోతున్న పుంతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సర్వే రాళ్లను కూడా తవ్వేస్తున్న వైనం
పుంతలో తవ్వకాలు
కొద్ది రోజుల క్రితం స్థానిక నీటిసంఘం ఆధ్వర్యంలో మంచినీటి కోడులో పూడిక తీశాం. పుంతగట్టుపై వేసిన మట్టిని ఎవరు తరలించుకుపోతున్నారో తెలియదు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి ఆరాతీస్తాం.
– ఫణిశంకర్, ఇరిగేషన్ ఏఈ, ఉండి
పుంత తవ్వుతున్న విషయం మా దృష్టికి రాలేదు. దీనిపై సిబ్బందిని అప్రమత్తం చేస్తాం. రెవెన్యూ అధికారి దృష్టిలో పెట్టి పుంత తవ్వకాలు జరిగితే వాటిని వెంటనే నిలుపుదల చేస్తాం. సర్వేరాళ్ళ తొలగింపు అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
– కార్తీక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఉండి
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
రెచ్చిపోతున్న మట్టి మాఫియా


