నాటు పడవలపై జోరుగా వేట
నరసాపురం: ప్రస్తుతం అటు సముద్రంలో, ఇటు గోదావరిలో చేపలు అధికంగా పడే సీజన్. దీంతో మత్స్యకారులు విరామం లేకుండా వేట సాగిస్తుంటారు. సముద్రంలో వేట సాగించే పెద్ద బోట్లను పక్కన పెడితే గోదావరిలో చెక్క నావలపై వేట సాగించే సంప్రదాయ మత్స్యకారుల సంఖ్య కూడా నరసాపురం ప్రాంతంలో తక్కువేమీ కాదు. ప్రస్తుత సీజన్లోనే మత్స్యకారులు గోదావరిలో వల కట్లు కట్టుకుంటారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. సంప్రదాయ మత్స్యకారులు వేటలో బిజీగా ఉన్నారు. ఎక్కువగా గోదావరిలో చెక్కనావపై వేట సాగుతోంది. దీంతో చెక్కనావలను వేటకు సిద్ధం చేయడం, నావల్లో వలలు సర్ధుకోవడం చేస్తున్నారు. దీంతో గోదావరి తీరంలో చెక్కనావలు సందడి చేస్తున్నాయి. గోదావరిలో వలకట్లు కూడా ముమ్మరంగా కడుతున్నారు.
భీమవరం: రాష్ట్రంలో పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. భీమవరంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయలేదన్నారు. దీనివల్ల ఎంతోమంది పేద విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు రావాల్సిన రూ.7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.లక్ష్మణ్, పి.సాయి కృష్ణ, బి.సింధు తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం రూరల్: ఒక మాజీ సైనికుడిని ఓ అధికారి లంచం డిమాండ్ చేశాడు. నరసాపురం పట్టణానికి చెందిన మాజీ సైనిక ఉద్యోగి పత్తి రాధాకృష్ణ మొగల్తూరు మండలం పేరుపాలెంలో తనకు చెందిన ఆక్వా సాగు భూమికి సంబంధించి అప్సడాలో నమోదు కోసం వెళ్తే వీఆర్వో దుర్గారావు రూ.3 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ మాజీ సైనిక ఉద్యోగి ఈ వ్యవహారానికి సంబంధించిన సంభాషణలు తన ఫోన్లో రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ సదరు వీఆర్వోను ఆర్డీవోకు సరెండర్ చేశారు.
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్–2026 ముసాయిదాలోని అంశాలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆయా అంశాలను ఏమాత్రం అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది. స్థానిక పవర్పేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త ముసాయిదా పెన్షన్ నిబంధనలపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై సమష్టిగా చర్చించి, ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ –1980ను దెబ్బతీసే ఏ మార్పులనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహించబోమని, ప్రభుత్వం వెంటనే ఈ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.
నాటు పడవలపై జోరుగా వేట


