పీపీపీపై ఉద్యమం ఉధృతం
మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ హెచ్చరిక
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని చంద్రబాబు సర్కారు విరమించుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ హెచ్చరించింది. మండలంలోని దగ్గులూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణాలను పరిరక్షణ కమిటీ రాష్ట్ర బృందం ఆదివారం పరిశీలించింది. అనంతరం పాలకొల్లులోని డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ భవనంలో కమిటీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జైభీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలిగే వ్యక్తుల్లో దేశంలోనే చంద్రబాబు అగ్రగణ్యులని విమర్శించారు. పీపీపీలో ప్రభుత్వ ని యంత్రణ ఉంటుందని సీఎం చెబుతున్నారని, ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు నడిపే ఆస్పత్రులు, స్కూళ్లలో ప్రభుత్వ నియంత్రణ ఉంటుందా అని ప్రశ్నించారు. రిజర్వేషన్లు లేని వ్యవస్థను నడిపించడమే పీపీపీ విధానం అన్నారు. పీపీపీ పేరుతో బాలకృష్ణకి కూడా ఒక కాలేజీని ఇవ్వాలని, పవన్ కళ్యాణ్కి కూడా 30 శాతం కాలేజీలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు. పరిరక్షణ కమిటీ కో–కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ పాలకొల్లులో మెడికల్ కాలేజీని ప్రభుత్వమే నిర్మించి నడపాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.బలరాం మాట్లాడుతూ పీపీపీలోనే ప్రజలకు సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుతాయని మంత్రి లోకేష్ ప్రకటించడం సిగ్గుచేటన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ గతంలో 107, 108 జీఓలను విడుదల చేసి వైద్య సీట్లను అమ్మకానికి పెడితే నేడు మొత్తం కాలేజీలను అమ్మేసే పద్ధతిని చంద్ర బాబు ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇంధన శాఖ అడిషనల్ డైరెక్టర్ ఏవీ పటేల్ మాట్లాడుతూ అట్టడుగు పేదలకు వైద్యం అందకుండా చేయడమే చంద్రబాబు సర్కారు లక్ష్యమా అని ప్రశ్నించారు. రాష్ట్ర కో–కన్వీనర్ కొరివి వినయ్కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ముందు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ గతంలో ఏ సమస్య వచ్చినా రోడ్డెక్కిన స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు ఇప్పుడు సొంత ఇ లాకాలో మెడికల్ కాలేజీని అమ్మేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే, ఐలు రాష్ట్ర గౌరవాధ్యక్షుడు దిగుపాటి రాజగోపాల్ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చుపెట్టలేని అసమర్థ సీఎం చంద్రబాబు అని మండిపడ్డారు. సంచర జాతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ పేదలకు అన్యాయం చేయాలని చూస్తే భవిష్యత్తులో వారే తగిన గుణపాఠం చెబుతున్నారు. కార్యక్రమంలో దగ్గులూరు సర్పంచ్ విశ్వనాథం పేరయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు కొలుకూరి అర్జున్రావు, కాకర రాజ్కుమార్, బీఎస్పీ నాయకుడు ఈవీసీ శేఖర్బాబు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకుడు సోడదాసి గంగయ్య, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి పూర్ణ, ఆల్ ఇండియా క్రిస్టియన్ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మత్తే రాజ్కుమార్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లాటి పెద్దిరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.


