నేటినుంచి సుబ్బారాయుడి కల్యాణోత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కల్యాణోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయం, పరిసరాలు విద్యుద్దీప అలంకారాలతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఈనెల 23 నుంచి 29 వరకు జరిగే కల్యాణోత్సవాల్లో భాగంగా, తొలిరోజు ఉదయం 9.30 గంటలకు అర్చకులు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. 24న పుణ్యహవాచనము, అంకురార్పణ, రాత్రి ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, 25న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసనను నిర్వహిస్తారు. 26న రాత్రి 7 గంటల నుంచి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. అలాగే 27న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, సాయంత్రం నెమలి వాహనంపై గ్రామోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహిస్తారు. 28న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యౌపాసన, బలిహరణ, పూర్ణాహుతి, అవబృధస్నానం, వసంతోత్సవం, ధ్వజావరోహణ వేడుకలను జరుపుతారు. 29న స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ద్వాదశి ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగోత్సవ వేడుకలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయని, ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కోరారు.


