
కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం
భీమవరం(ప్రకాశం చౌక్): భూ సమస్య పరిష్కరం కావడం లేదని ఒక వ్యక్తి ఆత్మ హత్యాయత్నం చేసిన ఘటన భీమరం కలెక్టరేట్లో జరిగింది. మొగల్తూరు దయాల్ దాస్ పేటకు చెందిన పాలా వీర వెంకట సత్యనారాయణ (64) కొంతకాలంగా భీమవరంలోని కిషోర్ థియేటర్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. పాలకొల్లు సమీపంలోని కొంతేరులో సత్యనారాయణకు 16 సెంట్ల స్థలం ఉండగా దానిపై వివాదం ఉంది. ఈ నేపథ్యంలో పలుసార్లు కలెక్టరేట్ స్పందనలో ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కావడం లేదని సోమవారం ఉదయం భీమవరం కలెక్టరేట్ స్పందనకు విషం తాగి వచ్చిన సత్యనారాయణ స్పందన హాల్లో పడిపోయాడు. సత్యనారాయణను పోలీసులు అంబులెన్న్స్లో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
భీమవరం: సమగ్ర శిక్ష భీమవరం జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్, అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టులకు స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మే 2 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 79890 02168 నెంబరులో సంప్రదించాలని తెలిపారు.
పంపిణీకి సిద్ధంగా పుస్తకాలు
భీమవరం: జిల్లాలో నూతన విద్యాసంవత్సరానికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, బ్యాగ్, బెల్ట్, షూ, డిక్షనరీలు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్, ఎస్ఎస్ఏ సీఎంఓ యండమూరి చంద్రశేఖర్ చెప్పారు. పుస్తకాల పంపిణీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి మండలంలో స్టాక్ పాయింట్కు చేర్చేలా ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే 8 మండలాలకు పాఠ్యపుస్తకాలు 65 శాతం చేరాయన్నారు. ఒక్కో విద్యార్ధికి మూడు జతల యూనిఫాం, ఒక జత షూ, రెండు జతల సాక్స్లు, బ్యాగ్, బెల్ట్ అందించనున్నట్లు చెప్పారు.
గడువులోగా ఫిర్యాదులు పరిష్కరించాలి
భీమవరం: పోలీసుస్టేషన్ల నుంచి వచ్చే ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోగా శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదులను స్వీకరించి అనంతరం ఆయా పోలీసుస్టేషన్ల అధికారులతో మాట్లాడారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యలపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కారానికి కృషిచేయనున్నట్లు భరోసా ఇచ్చారు.
ద్వారకాతిరుమలలో గణేష్ శర్మకు శిక్షణ
ద్వారకాతిరుమల: కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులైన రుగ్వేద పండితోత్తముడు దుడ్డు సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్వారకాతిరుమలలో రుగ్వేదాన్ని అభ్యసించారు. 2009లో వేసవి సెలవుల్లో తిరుపతిలోని మేనమావ ఇంటికి వెళ్లిన గణేష్ శర్మను ఆదే సమయంలో తిరుపతి వచ్చిన కంచికామకోటి పీఠం శంకరాచార్యస్వామీజీ దగ్గరకు పిలిచి ఆశీర్వదించారు. ద్వారకాతిరుమల దేవస్థానం రుగ్వేద సలక్షణ ఘనాపాటి, సకల జ్ఞాన సంపన్నుడైన రత్నాకర్ శర్మ వద్ద చేర్పించాలని ఆదేశించారు. దాంతో ఆయన రత్నాకర శర్మ ఇంటి వద్ద ఉండి 2009 నుంచి దాదాపు 12 ఏళ్లపాటు వేద విద్యను పట్టుదలతో నేర్చుకున్నారు. ఆయన వద్ద రుగ్వేద సంహిత, ఐతరేయ బ్రాహ్మణ అరణ్యకం, ఉపనిషత్తులు వంటి వాటిలో నిష్ణాతులయ్యారు. సప్తమంజరి, ధాతురూపావళి, సమస కుసుమావళి వంటి ఎన్నో పుస్తకాలను అవపోసన పట్టారు. 12 ఏళ్ల పాటు ద్వారకాతిరుమలలో శిక్షణ పొందిన గణేష శర్మ కంచికామకోటి పీఠం ఉత్తరాధికారిగా నియమితులవడం పట్ల ఇక్కడ వేద పండితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం