నర్సింగ్‌ విద్యార్థినులకువసతి వెతలు | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యార్థినులకువసతి వెతలు

Apr 27 2025 12:54 AM | Updated on Apr 27 2025 12:54 AM

నర్సింగ్‌ విద్యార్థినులకువసతి వెతలు

నర్సింగ్‌ విద్యార్థినులకువసతి వెతలు

ఏలూరు టౌన్‌: ఏలూరు సర్వజన ఆస్పత్రిలో జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం), బీఎస్సీ నర్సింగ్‌ విద్య అభ్యసిస్తున్న పేద వర్గాల బాలికలకు వసతి, ఇతర అవసరాలకు అన్ని విధాల ఆర్థిక సాయం చేస్తున్నామని సర్కారు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. గత పదేళ్ళుగా ప్రభుత్వం జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీల్లో విద్యార్థినులకు నర్సింగ్‌ విద్య ఉచితమంటూనే.. అరకొర స్టైఫండ్‌తో గడిపేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే కొద్ది మొత్తంతో నెట్టుకురావాల్సి ఉండడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా గాలికి వదిలేస్తోందని, పేద పిల్లలకు కనీసం నిధులు కేటాయించే పరిస్థితి లేకపోవటం దారుణమని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చదువుతున్న 550 మందికి పైగా నర్సింగ్‌ విద్యార్థినులకు రూ.19 లక్షల స్టైఫండ్‌ బకాయిలు ఉండడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

3, 4 నెలకోసారి స్టైఫండ్‌ : ఏలూరు సర్వజన ఆసుపత్రి భవనంలో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. జీఎన్‌ఎం కోర్సులో సుమారుగా 150 మంది విద్యార్థినులు ఉండగా, బీఎస్సీ నర్సింగ్‌ కోర్సులో 400 మంది ఉన్నారు. వీరిలో మొదటి సంవత్సరం జీఎన్‌ఎం కోర్సు చదివే విద్యార్థినికి రూ.3 వేలు, రెండు, మూడో ఏడాదిలో రూ.3500 స్టైఫండ్‌ ఇస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థినులకు రూ.4 వేల నుంచి రూ. 4500 వరకు ఇస్తారు. ప్రభుత్వం స్టైఫండ్‌ నెల నెలా ఇస్తే తప్ప గడవని పరిస్థితి. అలాంటిది మూడు, నాలుగు నెలకోసారి స్టైఫండ్‌ ఇవ్వడంతో ఖర్చులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రతి నెలా స్టైఫండ్‌ ఇవ్వకపోవడంతో వారి కష్టాలు వర్ణణాతీతం.

వసతి, భోజనం ఖర్చులు భరించాల్సిందే..

రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, మచిలీపట్నంలో జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలు ప్రభుత్వం నిర్వహిస్తోంది. బీఎస్సీ నర్సింగ్‌కు నీట్‌ ద్వారా ఎంపికలు చేస్తుండగా, జీఎన్‌ఎం కోర్సుకు డీఎంఈ నోటిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ నర్సింగ్‌ కాలేజీల నిర్వహణకు, భోజనం, వసతి కోసం నిధులు కేటాయించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఎస్సీ నర్సింగ్‌లో మెంటల్‌ హెల్త్‌ సబ్జెక్టుకు సంబంధించి శిక్షణ కేవలం విశాఖపట్నంలోనే ఉంది. ఈ సబ్జెక్టులో శిక్షణకు విశాఖపట్నం వెళ్లాలి. అక్కడ వసతి, భోజనం ఖర్చులు భరించాల్సి రావటంతో వారిపై పెనుభారం మోపినట్లేనని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్వేలు, శిక్షణల కోసం అదనపు ఆర్థిక భారం వేస్తున్నాయంటున్నారు.

నెలకు రూ.3 వేలతోనే నెట్టుకొస్తున్న వైనం

550 మందికి రూ.19 లక్షల స్టైఫండ్‌ బకాయిలు

ప్రభుత్వం నిధులు విడుదల

చేయకపోవడంతో ఇక్కట్లు

ప్రభుత్వానికి నివేదించాం

ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీకి సంబంధించి నిర్వహణ, భోజనం నిమిత్తం ప్రత్యేకంగా నిధులు ఏమీ మంజూరు చేయడం లేదు. విద్యార్థినులకు అందిస్తున్న స్టైఫండ్‌తోనే నిర్వహణ ఖర్చులు, భోజనం ఖర్చులు భరించాలి. ఇప్పటికే చాలా సార్లు నిధులు కేటాయించాలంటూ నివేదికలు పంపించాం. – వరలక్ష్మి, ప్రిన్సిపల్‌, జీఎన్‌ఎం నర్సింగ్‌ కాలేజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement