నెక్కొండ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. మండలకేంద్రంలోని టీజీ గురుకుల పాఠశాల /కళాశాల (పీఎంశ్రీ)ను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గదులు, భోజన, వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. వంటశాల అపరిశుభ్రంగా ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలన్నారు. పాఠశాల, జూనియర్ కళాశాల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను విడివిడిగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా టీచర్ స్వర్ణలత, పీఈటీ కమలకుమారి విధులకు ఆలస్యంగా హాజరుకావడం, వంటశాల అపరిశుభ్రంగా ఉండటంతో వార్డెన్ ప్రతిభకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని పాఠశాల/కళాశాల ప్రత్యేక అధికారి, ఎంపీడీఓ యాసం లావణ్యను కలెక్టర్ ఆదేశించారు. అలాగే ప్రిన్సిపాల్ మమత స్థానికంగా ఉండాలన్నారు. అధ్యాపకుల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలను పంపాలని ఎస్ఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, డీటీడీఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, డీఎస్డీఓ హమీద్, తదితరులు పాల్గొన్నారు.
‘సర్’ను నిబంధనలకు
అనుగుణంగా నిర్వహించాలి
‘సర్’ కార్యక్రమాన్ని నిబంధనల మేరకు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని లక్నెపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తున్న పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. ఓటర్లకు అందిస్తున్న సేవలు, దరఖాస్తులు పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా ఫారం 6, 7, 8లను అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్ రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
టీచర్, పీఈటీ, వార్డెన్కు
షోకాజ్ నోటీసులు


