ఖిలా వరంగల్: మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, సోదరభావం, మానవతా విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, కుల, మత సామర్యాన్ని పెంపొందించాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా బుధవారం వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతం, ఉర్సు కరీమాబాద్లోని హజరత్ మాషూక్ ఏ రబ్బానీ దర్గాలో పీఠాధిపతులు ఉబేద్బాబా, నవీద్బాబా ఆధ్వర్యంలో వేర్వేరుగా వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి సురేఖ హాజరై మాషూక్ రబ్బానీ దర్గాను దర్శించుకునే భక్తులకు కోసం నిర్మించిన విశ్రాంతి గదులను ప్రారంభించారు. అనంతరం దర్గాను దర్శించుకుని ఖీర్ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మిలాద్ ఉన్ నబీ పర్వదినం ప్రజలందరిలో ప్రేమ, సోదరభావం, మానవతా దృక్పథాన్ని మరింతగా పెంపొందించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, కాంగ్రెస్ నేత గోపాల నవీన్రాజు, ఎంఏ జబ్బార్, మహమ్మద్ ముక్దుమ్, నాగపూరి కల్పన, సంజయ్బాబు తదితరులు పాల్గొన్నారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ


