దుగ్గొండి: అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల దిగుబడి పెరిగి అధిక లాభాలు వస్తాయని కేవీకే ప్రధాన శాస్త్రవేత్త రాజుకుమార్ అన్నారు. మండలంలోని మహ్మదాపురం గ్రామంలో ఆత్మ ఆధ్వర్యంలో పాలడుగుల రాజు పత్తి పంటలో మంగళవారం క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాజుకుమార్ మాట్లాడారు. ప్రత్తిలో తెగుళ్లు, చీడపీడల ఉధృతిని గమనించడానికి ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెల్లదోమ, పచ్చదోమ నివారణకు ఎకరానికి 20 నుంచి 25 పసుపు, నీలి రంగులు అట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పేనుబంక, పచ్చదోమ నివారణకు లీటరు నీటికి 0.3 గ్రాముల ప్రోమికామిడ్, లేదా లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఐఎఫ్సీపీ మేనేజర్ విశాల్, ఏఈఓలు విజయ్, హనుమంతు, భారతి, వైజయంతి, సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


