శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ అరెస్ట్
హన్మకొండ: హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు నేపథ్యంలో మంగళవారం ఆందోళనలు చేపడతారని భావించిన పోలీసులు ముందుజాగ్రత్తగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. కొందరిని పోలీస్స్టేషన్కు తరలించగా, మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నర్సంపేటకు బయలుదేరుతుండగా కార్యాలయం గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ రాజకీయాన్ని ఇక్కడ రుద్ద దలచుకున్నారా అని మధుసూదనాచారి పోలీసులను ప్రశ్నించారు. తన బలగం ఏమైందని సుదర్శన్రెడ్డి ఆత్మ ఎదురు చూస్తుందని, వందల మంది పోలీసులు రండి వెళదామని చెప్పినా వదలకుండా మధుసూదనాచారిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరకు పోలీసులు పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం అన్యాయమని అన్నారు. సహచర ఉద్యమకారులుగా వెళ్లేందుకు రేవంత్రెడ్డి సర్కారు అడ్డుకుంటుందని, దీనికి వెనుక ఆంధ్ర కుట్ర దాగి ఉందని ఆరోపించారు. చంద్రబాబు ద్వారా ఆంధ్రా నుంచి రిమోట్ ఆపరేషన్ జరుగుతోందని, తెలంగాణ నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.


