కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారానికి సంబంధిత అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వినతుల పరిష్కార చర్యలపై కలెక్టర్.. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. మండల స్థాయి ప్రజావాణిని సజావుగా నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రభుత్వ హాస్టళ్లను పరిశీలించి మౌలిక వసతులపై నివేదికలు అందించాలన్నారు. హాస్టళ్లలో అవసరమైన వసతుల కల్పనకు అంచనాలు రూపొందించి ఇంజినీరింగ్ అధికారులకు పంపించాలని సూచించారు. కాగా, ప్రజావాణిలో జిల్లా స్థాయిలో 127, రెవెన్యూ డివిజన్ స్థాయిలో 47, మండల స్థాయిలో 187 కలిపి మొత్తం 361 వినతులు అందాయి. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శేషాద్రి, డీఆర్ఓ శ్రీనివాస్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.


