● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
హన్మకొండ: ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబందాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో శనివారం నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తమ ప్రభుత్వం పేదల పక్షపాతి అన్నారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేద పిల్లలకు నాణ్యమైన విద్య కోసం హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రంలో తొలి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని వివరించారు. హైదరాబాద్లో స్థలం లేని నిరుపేదలకు ఇందిరమ్మ టవర్లు నిర్మిస్తున్నామన్నారు. పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి లోపాలకు తావివ్వొద్దని సూచించారు. వరంగల్లో రూ.5,700 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మించనున్నట్లు తెలిపారు. కేంద్రాన్ని ఒప్పించి వరంగల్కు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చామన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ సౌకర్యముందన్నారు. ఎక్కడైనా రేషన్ పొందేలా స్మార్ట్ కార్డులు తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్.నాగరాజు, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, అడిషనల్ కలెక్టర్ రవి, డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ పాల్గొన్నారు.


