● కేజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ.రమణ
ఎల్కతుర్తి: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికే కేజీకేఎస్ (తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం) ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ తెలిపారు. మహబూబాబాద్లో ప్రారంభమైన గీతన్నల చైతన్య బస్సు యాత్ర ఆదివారం మండల కేంద్రానికి చేరుకోవడంతో గీత కార్మిక సంఘం నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సర్కిల్లో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ.. గౌడ కులస్తుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని, గీత కార్మికులకు రూ.4 వేలకు పెన్షన్ పెంచుతామని, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించి 32 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి రాష్ట్రంలో 1,600 మంది బాధితులకు సంబంధించిన సుమారు రూ.20 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. 50 ఏళ్లు పైబడిన గీత కార్మికులకు పింఛన్ ఇవ్వాలని, ప్రతీ గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కిట్లు అందించాలని కోరారు. తాటి, ఈత మొక్కలను వనమహోత్సవం కింద పెద్ద సంఖ్యలో నాటాలని, 460 సొసైటీలకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూముల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రూ.27 కోట్లను విడుదల చేసి నీరా యూనిట్ను పునరుద్ధరించాలన్నారు. కార్యక్రమంలో గీత కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.


