ఓరుగల్లుకు ‘పీఎం మిత్ర’ నే | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు ‘పీఎం మిత్ర’ నే

Aug 13 2026 12:51 AM | Updated on Aug 13 2026 12:51 AM

రూ.200 కోట్లతో కేఎంటీపీలో మౌలిక వసతుల కల్పన

సాక్షి, వరంగల్‌: కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు (కేఎంటీపీ)కు పీఎం మిత్ర హోదా రావడంతో ఓరుగల్లు జౌళి రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మారుతోంది. పార్కులో మౌలిక వసతుల కల్పనకు ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించామని కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా లోక్‌సభలో వెల్లడించారు. ఇప్పటికే దశలవారీగా మంజూరవుతున్న నిధులతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. పరిశ్రమలను ఆకర్షించేందుకు కాంపిటేటివ్‌ ఇన్సెంటివ్‌ సపోర్ట్‌ కింద రూ.300 కోట్ల వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. దీంతో కొత్త పెట్టుబడులు మరింత వేగంగా వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వచ్చిన పెట్టుబడులతోనే 24,400 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వీరిలో అత్యధికంగా మహిళలే ఉండడం గమనార్హం. పీఎం మిత్ర పథకం ద్వారా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందితే ఒక లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించే సామర్థ్యం ఉందని కేంద్రం పేర్కొంది.

రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు..

పీఎం మిత్ర పథకం కింద తెలంగాణ నుంచి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును 2023లో ఎంపిక చేశారు. గీసుకొండ, సంగెం మండలాల్లోని శాయంపేట హవేలీలో 1,327 ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో పత్తి నుంచి నూలు, దుస్తుల తయారీ, ఎగుమతుల వరకు పూర్తి విలువ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. పార్కు అభివృద్ధికి మొత్తం రూ.1,695.54 కోట్ల వ్యయం అంచనా కాగా.. వివిధ మార్గాల ద్వారా రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

టెక్స్‌టైల్‌ పార్కులో ఇప్పటికే 548 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చాయి. ఇందులో పీఎం మిత్రగా ఎంపికై న తర్వాతే 310 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కై టెక్స్‌, యంగ్‌వన్‌, గణేశా తదితర సంస్థలు సిబ్బందిని నియమించుకుని ఉత్పత్తిని ప్రారంభించడంతో పార్కులో సందడి నెలకొంది. మరిన్ని సంస్థలు పెట్టుబడులతో రావడానికి ఆసక్తి చూపుతున్నాయి.

5ఎఫ్‌ విధానంతో పార్కు అభివృద్ధి..

కాంపిటేటివ్‌ ఇన్సెంటివ్‌ సపోర్ట్‌ కింద మరో రూ.300 కోట్లు

ఇప్పటికే పలు కంపెనీలతో 24,400 మందికి ఉపాధి

లోక్‌సభలో కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి సబిత్రా మార్గరేటా వెల్లడితో చర్చ

ఫామ్‌ టు ఫైబర్‌.. ఫైబర్‌ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్‌.. ఫ్యాషన్‌ టు ఫారిన్‌ అనే 5ఎఫ్‌ విధానంతో పీఎం మిత్ర పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌, నిరంతర నీటి సరఫరా, అంతర్గత రహదారులు, కార్మిక వసతి, ఉమ్మడి బాయిలర్‌, 10 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంటు, సీఈటీపీ వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 2017లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేఎంటీపీకి శ్రీకారం చుట్టగా.. 2023లో పీఎం మిత్రలో ఎంపికతో దీనికి జాతీయ ప్రాధాన్యం లభించింది. ప్రస్తుతం కేంద్రం వెల్లడించిన పెట్టుబడులు, ఉపాధి గణాంకాలు పార్కు భవిష్యత్‌ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువత, మహిళలకు స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండడంతో సామాజికంగా దీని ప్రాధాన్యం పెరుగుతోంది. పీఎం మిత్రతో ఓరుగల్లు జాతీయ జౌళి కేంద్రంగా, పెట్టుబడులు, ఉపాధికి కొత్త గమ్యస్థానంగా ఎదిగే అవకాశాలు బలపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement