హన్మకొండ కల్చరల్: జ్యేష్టమాసం బహుళ చతుర్ధశి తిథి, ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం హనుమకొండలోని వేయిస్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసింది. శత వసంతాలకు ఒకసారి వచ్చే మహాశైవాక్షయోగం పరమశివుడి అనుగ్రహానికి అత్యంత శుభప్రదమైన కాలమని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. ఈ శుభకాలంలో వేయిమందికిపైగా భక్తులు స్వామివారికి రుద్రాభిషేకాలు జరుపుకున్నారు.
పోలీసుల అదుపులో నకిలీ
ఆర్గానిక్ ఎరువుల విక్రయదారు!
వర్ధన్నపేట: ఆర్గానిక్ ఎరువుల పేరుతో నకిలీ ఎరువులు విక్రయించి రైతులను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ల్యాబర్తి గ్రామానికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి రైతుల వద్దకు వచ్చి ఆర్గానిక్ ఎరువులు తక్కువ ధరకు ఇస్తామని నమ్మించే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రైతులు పోలీసులకు, వ్యవసాయ అధికారికి సమాచారం అందించగా గుర్తు తెలియని వ్యక్తి పారిపోయాడు. సోమవారం వ్యవసాయశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్ధన్నపేట పట్టణంలో పోలీసులకు చిక్కాడు. అయితే ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరిగి సాయంత్రం వరకు ఆ వ్యక్తిని వదిలేయడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులకు చిక్కిన వ్యక్తి స్థానిక ఏఓ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి వెళ్లి పోయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నకిలీ ఆర్గానికి ఎరువని స్థానిక మండల వ్యవసాయాధికారి ధ్రువీకరించి పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎందుకు కేసు నమోదు చేయలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికై న సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని రైతులు కోరుతున్నారు.
నాణ్యమైన బోధనకు డిజిటల్ టెక్నాలజీ కీలకం
కాళోజీ సెంటర్: ప్రస్తుత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయులు పాఠ్యాంశ బోధనకు పరిమితం కాకుండా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ నాణ్యమైన బోధన అందించాలని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉండ్రాతి సుజన్ తేజ అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సోమవారం శంభునిపేట ఉన్నత పాఠశాల, కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాంకు ఆయన హాజరై మాట్లాడారు. బోధనలో ఎదురవుతున్న సవాళ్లు, వాటి పరిష్కార మార్గాలు, విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచే వినూత్న బోధనా పద్ధతులపై చర్చించారు. తరగతి గది విద్యార్థి కేంద్రంగా ఉండాలని, ఆక్టివిటీ బేస్డ్, ఎక్స్పీరియన్షల్, కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ వంటి ఆధునిక బోధనా విధానాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ప్రతీ పాఠశాలలో శ్రీలెర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం(లిప్)ను పక్కాగా అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, సెంటర్ ఇంచార్జీలు రఫీక్, రాజకుమార్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్లు తాటిపాముల రమేశ్, అశోక్, శ్రీనివాస్, గౌస్ పాషా, మధు, వివిధ మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు
దరఖాస్తు గడువు పెంపు
విద్యారణ్యపురి: హైదరాబాద్లోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ–27) ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 19వరకు గడువు పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కె.జగన్మోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 26న హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు హెచ్టీటీపీ//టీఎస్స్టడీసర్కిల్.కో.ఇన్లో చూడాలన్నారు.


