● కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: నిర్మాణంలో ఉన్న సమీకృత వరంగల్ కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవన సముదాయాన్ని అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణం తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో భవనంలోని వివిధ విభాగాలు, మౌలిక సదుపాయాల పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బి ఈఈ రవీందర్, కుడా సీపీఓ అజిత్రెడ్డి, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, డీబీసీడీఓ పుష్పలత, అధికారులు ఉన్నారు.
పురావస్తు, పర్యాటక శాఖలపై సమీక్ష
జిల్లాలో పురావస్తు సంపద, పరిరక్షణ, పర్యాటకరంగ అభివృద్ధి పనులపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో కలెక్టర్ సత్యశారద సమీక్షించారు. వరంగల్ కోటలో నూతనంగా నిర్మించిన మ్యూజియంలోకి పాత మ్యూజియంలోని శిల్పాలు, పురావస్తు సంపదను తరలించేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మొగిలిచర్ల ఏకవీరాదేవి ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై చర్చించారు. కోటలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, పరిరక్షణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, కుడా సీపీఓ అజిత్రెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అధికారి అనిల్, కేంద్ర పురావస్తుశాఖ అధికారి వంశీకృష్ణ, రాష్ట్ర పురావస్తు శాఖ ఏడీ గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ను
వేగవంతం చేయాలి
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేసి వెంటనే డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారంలోపు ఫారాల పంపిణీని పూర్తిచేయాలని, ఓటర్లు నింపిన ఫారాలను బీఎల్ఓలు తిరిగి సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ ఫారాన్ని పూరించడంలో ఇబ్బంది పడుతున్న బీఎల్ఓలకు సూపర్వైజర్లు సహకరించాలన్నారు. అవసరమైన చోట అనుభవం ఉన్న వలంటీర్లను నియమించి బీఎల్ఓలకు సహకారం అందించాలని సూచించారు. సూపర్వైజర్ల పనితీరును ఎన్నికల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజనీ, తహసీల్దారులు, తదితరులు పాల్గొన్నారు.


