ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
కాళోజీ సెంటర్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ బుధవారం ప్రశాంతంగా ముగిసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పరీక్షలకు 92 మంది జనరల్ విద్యార్థులకు 90 మంది, ఒకేషనల్లో 184 మందికి 184 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 28 మంది జనరల్ విద్యార్థులకు 27 మంది హాజరైనట్లు తెలిపారు. డీఈసీ సభ్యులు మాధవరావు, విజయ నిర్మల పర్యవేక్షించారని చెప్పారు.
ప్రకృతి వ్యవసాయం రైతులకు మేలు
ఖానాపురం: ప్రకృతి వ్యవసాయ విధానంతో రైతులకు మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధాన ఆచరణ ప్రాజెక్టులో భాగంగా మంగళవారిపేటలో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భూమి, పర్యావరణం, సమస్త జీవరాశికి హాని కలిగించని విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద పలు యూనిట్లను ఎంపిక చేశామని పేర్కొన్నారు. ఇందులో కృషి, సఖీ చొప్పున ఇద్దరు మహిళలను ఎంపికచేసి ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ముందుగా మండల కేంద్రంలో ఎరువుల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎరువుల పంపిణీలో యాప్ పనివిధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వ్యవసాయ అధికారి శ్రీనివాస్, విస్తరణ అధికారి అంకుషావలీ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మలతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం
గీసుకొండ: పొదుపు సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను బొమ్మలతో అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతామని ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమం అమలుతీరును బుధవారం ఆయన మండలంలోని మరియపురం, కొనాయమాకుల గ్రామాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ పలక, బలపం లేకుండానే కేవలం బొమ్మల ద్వారా అక్షరాలను నేర్చుకునే విధంగా ప్రభుత్వం పుస్తకాలను రూపొందించిందని అన్నారు. 90 రోజుల పాటు జరిగే అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సెర్ప్ సీసీలు, వలంటీర్లు, అక్షరాస్యులైన సంఘాల ప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ప్రతీ వీఓలో 60 మంది నిరక్షరాస్యులను గుర్తించి అక్షరాస్యులను చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. సెర్ప్ మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను అక్షరాస్యులను చేయాలని సూచించారు. సీసీలు నర్సయ్య, సురేశ్, శ్రీలత, రాధిక, శిల్ప, శారద, వీఓఏలు కిరణ్, సాంబరాజు, జ్యోతి, సరస్వతి, రమ, అభ్యాసకులు పాల్గొన్నారు.
పాఠశాలలో బాలికపై లైంగిక దాడికి యత్నం
పర్వతగిరి: ప్రభుత్వ పాఠశాలలో ఓ బాలికపై లైంగిక దాడికి యత్నించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వరంగల్ జిల్లా పర్వతగిరి ఎస్సై బి.ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక బుధవారం పాఠశాలకు వెళ్లింది. ఉదయం 9 గంటల సమయంలో తరగతి గదిలో ఎవరూ లేకపోవడంతో ధరావత్ సురేశ్ అనే యువకుడు బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె భయంతో అరవగా సమీపంలో ఉన్న అంగన్వాడీ ఆయా వచ్చి కాపాడింది. ఇంతలోనే సురేశ్ పారిపోయాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్


