పర్యావరణంపై అవగాహన కోసమే..
వర్ధన్నపేట : హరిత పోలింగ్ స్టేషన్ను
పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యశారద
నర్సంపేట : పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యశారద
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నర్సంపేట/వర్ధన్నపేట: ఓటర్లకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు హరిత, పర్యావరణ హిత పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కలెక్టర్ నర్సంపేట, వర్ధన్నపేటలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. నర్సంపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హరిత పోలింగ్ స్టేషన్, బొందబడి ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిత్యావసర వస్తువుల తయారీ ప్రదర్శనలు ఏర్పాటుచేసి, పునర్వినియోగ ప్రాధాన్యం చాటి చెప్పారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని వివరించే సందేశాలు ప్రజల్లో చైతన్యం రేకెత్తించాయి. వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన హరిత పోలింగ్ కేంద్రం, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకట్టుకుంది. అక్కడ సమీపంలోని సెల్ఫీ పాయింట్ వద్ద పెన్తో పాటు ఓటు రిస్ట్ బాండ్లను ఓటర్లకు కలెక్టర్ సత్యశారద అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ శాతం పెంచేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు.. మన బాధ్యత కూడా అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, మున్సిపల్ కమిషనర్ సుధీర్కుమార్, ఎంపీడీఓ వెంకటరమణ, నోడల్ ఆఫీసర్లు భాగ్యలక్ష్మి, పుష్పలత ఉన్నారు.
పర్యావరణంపై అవగాహన కోసమే..


