ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ విజిట్కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి..
కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్గా అంచనా వేయాలని సూచించారు.
మెడికేషన్లో నూతన పోకడలు
మెడికేషన్లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు.
కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు.
కాకతీయ యూనివర్సిటీ వీసీ
ఆచార్య ప్రతాప్రెడ్డి
ముగిసిన ఫార్మసీ కాలేజీ
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు


