నియంత్రణలో నేరాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలకు ఇబ్బంది కలిగించే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు, ఇది మనం రక్షించడానికి ప్రమాణం చేసిన సమాజంలో సమష్టి ధృఢ సంకల్పం, భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు ఉన్నాయని తెలిపారు. నేరాల అదుపు, కేసుల పరిశోధనలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలలోని పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని నూతన విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక – 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాబోవు 2026 నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారం నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.
గతేడాదితో పోలిస్తే గణనీయంగా
తగ్గుముఖం
కమిషనరేట్ పోలీసుల పనితీరు
సంతృప్తికరం
2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు
వరంగల్ పోలీసు కమిషనర్
సన్ప్రీత్సింగ్ వెల్లడి
వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక–2025 ఆవిష్కరణ


