ఏళ్ల తపస్సు. కఠోర శ్రమ. నిరంతర అభ్యాసం. అహోరాత్రులు చదువే ధ్యాస. శ్వాస పీల్చినా వదిలినా లక్ష్యమే మననం. ఆ లక్ష్యానికి ప్రేరణ కొందరికి తల్లిదండ్రులైతే.. మరికొందరికి విజయం సాధించిన వారి మాటలు. కొందరికి వారు పెరిగిన వాతావరణమైతే.. ఇంకొందరికి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు.. ఫైనల్గా వారందరి లక్ష్యం ఒక్కటే పేదలకు సేవ చేయడం. అందుకనుగుణంగా వారు చివరి మెట్టు ఎక్కేశారు. గురిచూసి విజయాన్ని ఛేదించారు. ఇప్పుడు వారంతా మనం గర్వించేలా చెప్పుకునే ఉన్నతాధికారులు. యూపీఎస్సీలో సత్తాచాటిన ఓరుగల్లు తేజాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు IIలో..
I
గోల్ పెట్టుకొని ప్రిపేరయ్యా..
జనగామలోని సెయింట్ పాల్స్లో ఏడో తరగతి చదువుకునే సమయంలోనే కలెక్టర్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నా. అమ్మా, నాన్న ప్రోత్సాహం, చదువు నేర్పిన గురువుల సలహాలు, సూచనలతో ఇంతటి ఘనత సాధించా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు సాధించాలనే పట్టుదలతో అహోరాత్రులు కష్టపడి ప్రిపేరయ్యా. తల్లిదండ్రుల సహకారం, వారు పంచిన ప్రేమే 82వ ర్యాంకు వచ్చేలా చేసింది. ఎప్పుడు రిలాక్స్గానే ఉంటూ.. మైండ్లోకి ఏ ఆలోచనలూ రానివ్వకుండా ప్రిపేరయ్యాను. ఎంట్రెన్స్ రాసిన తర్వాత, మంచి ర్యాంకు వస్తుందని పెట్టుకున్న నమ్మకం నిజమైంది.
– మెరుగు కౌశిక్, 82వ ర్యాంకర్, జనగామ
ప్రజా సేవ చేసేందుకు...
రైతులు, ప్రజ లకు సేవ చేసేందుకు ఐఏఎస్ ఉద్యోగం ద్వారా ఎక్కువ అవకాశాలుంటాయని భావించి సివిల్స్ వైపు వెళ్లాను. గతంలో వచ్చిన ర్యాంకుతో ఐపీఎస్కు ఎంపికయ్యా. ఐఏఎస్కు ఎంపిక కావాలనే లక్ష్యంతో మరోసారి సివిల్స్కు హాజరయ్యా. ఈ సారి గతంలో కంటే మెరుగైన ర్యాంకు వచ్చింది. ఈ సారి ఐఏఎస్కు ఎంపికవుతాననే ఆశలున్నాయి. అవకాశం రాకపోతే గతంలో వచ్చిన ఐపీఎస్లో కొనసాగుతా.
– రావుల జయసింహారెడ్డి, 104వ ర్యాంకర్, హనుమకొండ
యూపీఎస్సీలో సత్తా చాటిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులు
మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకుతో ఐఏఎస్ సాధించిన కౌశిక్
మరోసారి సత్తా చాటిన జయసింహారెడ్డి.. ఈసారి 104వ ర్యాంకు
చివరి ప్రయత్నంలో రైతు బిడ్డ సయింపు కిరణ్కు 568వ ర్యాంకు