వనపర్తి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సామాజిక, న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శుక్రవారం జిల్లాకు విచ్చేసిన ఆయనకు కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ సునీతారెడ్డి పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి జిల్లా అధికారులతో ఆయన సమావేశమై జిల్లాలో ఎస్సీ, ఎస్టీల సమస్యలు, అట్రాసిటీ కేసుల పరిష్కారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించడం అధికారుల బాధ్యత అని అన్నారు. అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించి, నిబంధనల ప్రకారం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుశాఖకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తూ.. ఎస్సీ, ఎస్టీలపై నమోదైన కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసు అధికారులు చట్టప్రకారం వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను పెండింగ్లో ఉంచొద్దని తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ సంబంధించిన కేసులు పెండింగ్లో లేకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. భూ సమస్యలపై అందిన ఫిర్యాదులను సులభతరంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన బాధితులకు అందాల్సిన పరిహారం తదితర ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏమైనా పరిహారాలు పెండింగ్లో ఉంటే వాటి వివరాలను తమకు నివేదిక రూపంలో సమర్పించాలని తెలిపారు. ఈ నెల 22న ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో చర్చించి నిధుల విడుదలకు చొరవ తీసుకుంటామన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని.. ఇందులో తహసీల్దార్లతో పాటు ఎస్ఐలు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే
ప్రతి ఒక్కరిని గౌరవించడం
అధికారుల బాధ్యత
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
బక్కి వెంకటయ్య


