కొత్తకోట: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి.. రైతులు, ప్రజలను మోసం చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబురాలు చేసుకుంటుందని.. ఈ వెయ్యి రోజుల్లో రైతులకు, సామాన్య ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు వర్షంలా కురిపించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రూ. 2లక్షల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయకుండా, కొందరికే పరిమితం చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. రైతుభరోసా సకాలంలో అందక, పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరా లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొడంగల్కు విద్యుత్ సరఫరా చేస్తూ.. ఇతర ప్రాంతాల రైతులకు ఎందుకు కోతలు విధిస్తున్నారని నిలదీశారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. రాజకీయ ప్రచారాలు, సంబురాలకే పరిమితమైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ మాటలు ఎక్కువగా చెప్పారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకుమించి మాటలకే పరిమితమవుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, గిట్టుబాటు ధరల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని 7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నంది నర్సయ్య, జాతీయ కోఆప్షన్ సభ్యుడు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, డోకూర్ పవన్కుమార్ రెడ్డి, అయ్యవారి ప్రభాకర్రెడ్డి, కొండ ప్రశాంత్రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, రాజవర్దన్రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి సత్యంసాగర్, దాబా శ్రీను, నరేంద్రగౌడ్ పాల్గొన్నారు.


