నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు.
నల్లమల ప్రాంతంలో మేలుజాతి పొడ పశువులు
మన్ననూర్ గిత్తగా నామకరణం..
2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బికె)లో ఈ ప్రాంత రైతులు, తెలంగాణ జీవవైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేసింది. అదేవిధంగా పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 వేలకు తగ్గిపోయింది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనే వారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతాల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశు పోషణ భారంగా మారి చాలామంది ఆ వృత్తిని వదులుకుంటున్నారు.


