వనపర్తి రూరల్: గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మండలంలోని కడుకుంట్ల పీహెచ్సీని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి పాముకాటు బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, యాంటీ స్నేక్ వీనం (ఏఎస్వీ) నిల్వలు, వాటి వినియోగం, పాము కాటు కేసులు వచ్చినప్పుడు చేపడుతున్న వైద్య ప్రక్రియ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు పీహెచ్సీ స్థాయిలోనే తక్షణ వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అవసరమైన మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలో గర్భిణుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై చర్చించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భౌతికశాస్త్రం, గణితం, ఆంగ్లం సబ్జెక్టులో ప్రత్యేకంగా రూపొందించిన సామగ్రి ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్నాయక్, వైద్యాధికారి రాకేష్రెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


