వనపర్తి: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుడి నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు మంజునాథ్రెడ్డి, పర్వతాలు, నరేష్, ఎస్ఐలు హరిప్రసాద్, హృషికేష్, స్వాతి, రజిత, హిమబిందు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, మొగ్దుంబారీ, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధుల
నియంత్రణకు చర్యలు
అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్నాయక్ తెలిపారు. ఆగస్టులో సీపీఎం నాయకులు డీఎంఆర్ఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో బుధవారం స్వయంగా పరిశీలించేందుకు వచ్చి ఫిర్యాదుదారులను ఆస్పత్రికి పిలిపించి మాట్లాడారు. అలాగే రోగులతో మాట్లాడి వసతులు, వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంఆర్ఎం ఆస్పత్రి పీహెచ్సీగా అప్గ్రేడ్ అయినందున 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి కేటాయించిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరేలా చూస్తామన్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటుందని.. సమస్య తీవ్రతను డ్యూటీలో ఉన్న వైద్యుడికి వివరించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. ఆస్పత్రి వద్దనే 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయని వినియోగించుకోవాలని సూచించారు.
కార్మికులపై
పనిభారం తగ్గించాలి
వనపర్తిటౌన్: కార్మికులపై పని భారాన్ని తగ్గించి రూట్ సర్వే ఆధారంగా సమయాలను కేటాయించాలని, అలవెన్స్లను 80 శాతం పెంచి అమలు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిపో అధ్యక్షుడు ఏజీ కృష్ణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం, గతంలో అంగీకరించిన అంశాల అమలును కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విన్నర్ పథకం కింద నియమితులైన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలతో పాటు ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ పోస్టింగ్లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతపై కమిటీ, విలీన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిపో మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రీజియన్న్ అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, కార్యదర్శి సి.నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు.


