వనపర్తి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని చాణక్య పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరై పాఠశాల రేడియో స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, తెలియక చేసే తప్పిదాలు భవిష్యత్లో తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేధికలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన లేకుండా చేసే తప్పులు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


