వనపర్తి: సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో దాఖలు చేసిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు సిఫారస్ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోరుతూ దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. ఫిర్యాదులకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలోనిది కాదంటే.. వెంటనే సంబంధిత శాఖకు బదిలీ చేయాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అర్జీలను తమ వద్ద పెండింగ్లో ఉంచుకోరాదని తెలిపారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి అర్జీలను సైతం సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి ముగిసే వరకు 34 అర్జీలు దాఖలయ్యాయి.


