వనపర్తిటౌన్: జిల్లా ప్రజలు శుక్రవారం రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ప్రతి ఇంట్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు వేడుకల్లో పాల్గొని అక్కలు తమ తమ్ముళ్లకు, చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి తమ అనుబంధాలను చాటారు. పౌర్ణమి సందర్భంగా పలువురు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి నైవేద్యాలు సమర్పించారు.
ప్రముఖుల ఇళ్లలో..
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డికి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టగా.. ఆయన వారికి చీరలను బహూకరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికి సోదరీమణులు సుదర్శనమ్మ, బాలకిష్టమ్మ రాఖీలు కట్టారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్రెడ్డికి ఆయన చెల్లెలు విజయలక్ష్మి పద్మనాభరెడ్డి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ డిపోలోని మహిళా ఉద్యోగులు, కండక్టర్లు విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లకు రాఖీలు కట్టారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


