వనపర్తి: ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బండరావిపాకుల నిర్వాసితులు 125 మందికి రూ.8.33 కోట్ల విలువైన పరిహారం చెక్కులను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు.సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయడం తమ తొలి ప్రాధాన్యత అన్నారు. బండరావిపాకుల నిర్వాసితులకు పరిహారం అందజేయడం సంతోషంగా ఉందని.. తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండరావిపాకుల, కొంకలపల్లి నిర్వాసితుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.67 కోట్ల పరిహారం విడుదల చేసిందని వెల్లడించారు. పరిహారం విడుదల ప్రక్రియకు కృషి చేసిన కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మొత్తం 175 మందికి పరిహారం ఉందాల్సి ఉండగా, చనిపోయిన వారు, బ్యాంకు ఖాతాల సమస్యలతో కొందరికి చెక్కులు రాలేదని, వారికి కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ముంపు బాధితులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అధికారులు, ఎమ్మెల్యే చొరవతో బండరావిపాకుల ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం త్వరగా విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, గోపాల్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, వైస్ చైర్మన్ సత్యశీలారెడ్డి, ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.


