కొత్తకోట రూరల్: జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్టయ్య క్రీడా ప్రాంగణంలో జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికల్లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు కావలి సాయిచందన, కావలి నవ్యశ్రీ విశేష ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. అండర్–20 విభాగం డిస్కస్త్రో పోటీలో సాయిచందన, అండర్–14 విభాగం జావెలిన్త్రో కావలి నవ్యశ్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 27, 28 తేదీల్లో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్–2026లో వీరిద్దరూ పాల్గొననున్నారు. సొంత అక్కాచెల్లెళ్లు జిల్లాస్థాయిలో విజయం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణమని వ్యాయామ శిక్షకుడు ఎం.అజయ్కుమార్ ఆన ందం వ్యక్తం చేశారు. క్రీడాకారిణులను గ్రామపెద్దలు, క్రీడాభిమానులు, యువత అభినందిస్తూ రాష్ట్రస్థాయిలోనూ ఉత్తమ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
హాస్టల్ బియ్యం
పక్కదారి : పీడీఎస్యూ
వనపర్తిటౌన్: స్థానిక ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్కు కేటాయించిన బియ్యం నిల్వల్లో వ్యత్యాసాలు, అక్రమాలు చోటు చేసుకున్నాయని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు పవన్కుమార్ ఆరోపించారు. 46 క్వింటాళ్లకుగాను కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే వచ్చాయన్న ప్రాథమిక సమాచారంతో రెవెన్యూ అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం తహశీల్దార్ హాస్టల్ను తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆయన ఇచ్చిన పంచనామాలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. వార్డెన్ నరేందర్రెడ్డి ఈ నెల 13న 15 క్వింటాళ్ల బియ్యాన్ని హ్యాండ్ లోన్గా తీసుకున్నట్లు పంచనామాలో పేర్కొన్నా.. గోదాం రికార్డుల్లో లేదని అధికారులే స్పష్టం చేశారని చెప్పారు. ఆ బియ్యం ఎక్కడికి తరలించారో జిల్లా యంత్రాంగం తక్షణమే తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన బియ్యం, నిల్వలు, మెస్ వినియోగం, డైట్ బిల్లులను ఆడిటింగ్ చేయాలని.. అక్రమాలు రుజువైతే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ పట్టణ అధ్యక్షుడు దేవర శివగౌడ్, ప్రతినిధులు మహేందర్ నాయుడు, ధర్మేందర్, రాజు, బాలవర్ధన్, బంజారా గిరిజన విద్యార్థి సమైక్య ప్రతినిధి శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.


