పాన్గల్: భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా వీబీజీ రాంజీ పథకం ద్వారా చేపపడుతున్న ‘జలసిరి’ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మండలంలోని గోప్లాపూర్లో నిర్మాణంలో ఉన్న ఫాంపాండ్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. రైతు పల్లవితో మాట్లాడి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఫాంపాండ్తో వర్షపు నీరు నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాల పెంపు, బోర్ల రీచార్జి, వ్యవసాయ అవసరాలకు నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రైతు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి ఎక్కువ సంఖ్యలో నిర్మించుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఫాంపాండ్ల నిర్మాణంతో కలిగే ప్రయోజనాలను వివరించి లక్ష్యాన్ని చేరుకులా తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. జిల్లాకు 1,320 ఫాంపాండ్ల లక్ష్యాన్ని నిర్దేశించారని.. ఆ సంఖ్యను రెండు వేల వరకు పెంచాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున రైతులు వరి కాకుండా వేరుశనగ, కంది, పెసర, మినుములు వంటి ఆరుతడి పంటలు సాగుచేయాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడంతో నీటి కొరతను అధిగమించి రైతులు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు.


