వనపర్తిటౌన్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో ఈ నెల 20న జిల్లాస్థాయి అథ్లెట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–14 విభాగంలో ట్రయాథ్లాన్–ఏ,బీ,సీ, కిడ్స్ జావెలిన్, అండర్– 16లో 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, అండర్–18 విభాగంలో 100, 200, 400, 1000 మీటర్ల పరుగుపందెం, లాంగ్జంప్, హై జంప్, అండర్ –20లో 100, 200, 400, 800, 1,500, 3,000 మీటర్ల పరుగుపందెం, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, షాట్ఫుట్, డిస్కస్ త్రో పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈ నెల 27, 28 తేదీల్లో హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ మీట్– 2026కు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 20న ఉదయం 8 గంటలకు క్రీడా ప్రాంగణంలో రిపోర్టు చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు అథ్లెటిక్స్ కోచ్ శంషీర్ అలీ 94413 53375 నంబర్కు సంప్రదించాలని తెలిపారు.
ఫిర్యాదులపై
సత్వర చర్యలు : ఎస్పీ
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది ఎస్పీ సునీతారెడ్డిని నేరుగా కలిసి ఫిర్యాదులు చేశారు. ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. సంబంధిత పోలీస్టేషన్ అధికారులకు ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
లా, ఇంజనీరింగ్
పరీక్షలు ప్రారంభం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్ రెండో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పరీక్షల నియంత్రణాధికారి ప్రవీణ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. లా రెండో సెమిస్టర్ పరీక్షకు 80 మందికి 78 మంది హాజరుకాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ పరీక్షకు 182 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ప్రవీణ సూచించారు. సూపరింటెండెంట్ భూమయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రకిరణ్ పాల్గొన్నారు.
ఇంజనీరింగ్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 19, 20 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ రమేష్బాబు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో 23, డేటా సైన్స్లో 35, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–మెషిన్ లెర్నింగ్లో 5 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నిర్ణీత తేదీల్లో పీయూ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావా లని సూచించారు. రోస్టర్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని, టీజీఎప్సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఫీజులను ఎప్సెట్–2026 వెబ్సైట్లో ప్రకటించిన విధంగా చెల్లించాలని సూచించారు.


