అమరచింత: వర్షాకాలంలో పరిసరాల్లో వర్షపు నీరు నిలిచి అపరిశుభ్రంగా మారి ఈగలు, దోమలు వ్యాప్తి చెంది ప్రజలు విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ముందస్తుగా వారంలో ఒకరోజు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించినా.. ఆశించిన మేర ప్రజల్లో చైతన్యం తీసుకురాలేకపోతున్న పరిస్థితులున్నాయి. గత ప్రభుత్వం పురపాలికల్లో ఆదివారం పది గంటలు.. పది నిమిషాల కార్యక్రమం ద్వారా పరిసరాల శుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినా ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాని పురపాలికల్లో మాత్రం సరపడా ఫాగింగ్ యంత్రాలు లేకపోవడం విశేషం. కరోనా సమయంలో ప్రపంచమంతా కరోనాతో భయపడుతుంటే అమరచింత పురపాలికలో మాత్రం ప్రజలు డెంగీ బారిన పరిస్థితులు ఉన్నాయి.
జ్వరాల వ్యాప్తి సీజన్..
మున్సిపాలిటీల్లో లోపిస్తున్న పారిశుద్ధ్యం
వర్షాకాలం.. సీజనల్ వ్యాధుల భయం
నామమాత్రంగా
ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమం
అధికమవుతున్న
దోమలు, ఈగల బెడద
ఫాగింగ్ యంత్రాలున్నా.. నిరుపయోగం
వర్షాకాలం అంటే చాలు.. రోగాల సీజన్ ప్రారంభమైనట్లే. విషయం తెలిసినా సరే సంబంధిత అధికారులు నివారణకు ముందస్తు చర్యలు మాత్రం చేపట్టడం లేదు. డ్రైనేజీలను శుభ్రపర్చడం, నీటినిల్వ గుంతలను గుర్తించి వాటిని మట్టితో కప్పి ఉంచడం, కాలనీలలో ఫాగింగ్ చేపట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా.. అప్పుడప్పుడు ఫాగింగ్ మాత్రమే చేస్తూ చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలున్నాయి.


