వనపర్తి రూరల్: నిరుద్యోగ యువతకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిలెల్ల చిన్నారెడ్డి కొనియాడారు. ఆదివారం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, డీసీపీ మధుకర్స్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపికకు ఉచిత కోచింగ్కు మండలంలోని రేడియంట్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎలిజిబిలిటి టెస్టు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 500 మంది అభ్యర్థులకు పరీక్ష ప్రశ్నపత్రాలు అందజేసి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఎంపిక పరీక్ష నిర్వహిస్తుండం అభినందనీయమన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు మధుకర్స్వామి, గద్దె భాస్కర్ నిరుద్యోగ యువతకు అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతకు ఆర్థికభారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించడం సామాజిక బాధ్యతతో కూడిన గొప్ప కార్యక్రమమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని నిర్యుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాహితి కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్గౌడ్, ప్రిన్స్పాల్ తిరుమలేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్రెడ్డి, కవిత, బాలసుబ్రమణ్యం, శైలజ, సాహితి, బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, రాంకీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొన్నారు.


