వనపర్తి రూరల్: ఉపాధ్యాయులు, విద్యాధికారులు విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంలోని పరిస్థితులపై అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని అంజనగిరి ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి తరగతి గదిలో ఉపాధ్యాయుడై శుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యత తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి ఆసక్తి పెంచేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. గత నెలలో పాఠశాలను సందర్శించినప్పుడు సొంత ఖర్చుతో భోజనం అందిస్తానని ఇచ్చిన హామీ మేరకు తయారు చేయించి తన చేతులతో విద్యార్థులకు వడ్డించారు. ఆప్యాయంగా పలకరించి ఆహారం అందించే రైతు, రైతుకూలీల విశిష్టతను వివరించారు. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను గౌరవించాలని కోరారు. ప్రజాప్రతినిధులు తరచూ తనిఖీ చేస్తూ వసతులు, ఆహార నాణ్యతపై శ్రద్ధ చూపి మెరుగుపర్చాలని, తద్వారా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శాంతమ్మ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, సింగిల్విండో అధ్యక్షుడు రఘువర్ధన్రెడ్డి, నందిమళ్ల అశోక్, దేవకుమార్, ధర్మానాయక్, మాధవరెడ్డి, మహేశ్వర్రెడ్డి, చిట్యాల రాము, సురేష్, యాదగిరి, వాసు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.


