పీయూ ఆధ్వర్యంలో 7, 8 తేదీల్లో కన్హా శాంతివనంలో నిర్వహణ
మొదటిసారి అవకాశం..
కీలక ఎంఓయూలు..
14 కమిటీల ఆధ్వర్యంలో..
ఉద్యోగావకాశాలు..
గొప్పతనం చాటుతాం..
అరుదైన అవకాశం..
● హాజరుకానున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వీసీలు, కేంద్ర విద్యా శాఖ అధికారులు
● రెండోరోజు పీయూను
సందర్శించనున్న వీసీలు
● వచ్చే అతిథులకు హోటళ్లలో
బస, వాహనాల ఏర్పాటు
● అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన
యూనివర్సిటీ అధికారులు
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ సెమినార్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సుమారు 800 మంది వరకు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ సమీపంలోని కన్హాశాంతి వనంలో శుక్ర, శనివారాల్లో సెమినార్లో నిర్వహించనున్న సెమినార్లో మొదటిరోజు ప్రారంభ కార్యక్రమం అక్కడే జరుగుతుండగా.. విద్యార్థుల కోరిక మేరకు రెండోరోజు పలు సెషన్స్ పీయూలో కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీయూలో ఉషా నిధులు వినియోగించి నిర్మించిన భవనాలు, ఇతర సదుపాయాలను పలు యూనివర్సిటీల వీసీలతో పరిశీలించనున్నారు. అలాగే పీయూ విద్యార్థులకు అందిస్తున్న విద్య, వసతి, పరిశోధన తదితర అంశాలను వచ్చిన అతిథులకు వివరించనున్నారు. అదేరోజు సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతివనంలో జరగనుంది.
గత విద్యా సంవత్సరంలో యూనివర్సిటీకి పీఎం ఉషా (ప్రధానమంత్రి ఉచ్చత్తర్ శిక్షా అభియాన్) కార్యక్రమం కింద రూ.100 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పీయూలో జాతీయ సెమినార్ ‘విజన్ ఇండియా–2047’ ఇంటిగ్రేటింగ్ సైన్స్, ఇన్నోవేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ పేరుతో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకోసం రూ.36 లక్షలు కేటాయించింది. దీంతో దక్షిణ భారతదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీయూకు మొదటిసారి అవకాశం దక్కినట్లయింది.
సెమినార్కు కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన రీసెర్చి సాలర్స్, స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. నేషనల్ సెమినార్లో వీరు తాము రూపొందించిన నూతన ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ శాస్త్ర, సాంకేతికతతో కూడిన పరిశోధనలకు సంబంధించి పలు ఎంఓయూలు (మెమోరాండం ఆఫ్ అండ్ స్టాండింగ్) సంస్థలతో ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ఇతర యూనివర్సిటీలతోనూ ఎంఓయూలు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పీయూకు పలు ప్రాజెక్టులు, పరిశోధనల్లో సహకారం వంటివి లభించనున్నాయి.
పీయూలో ప్రతి సంవత్సరం సుమారు 650 నుంచి 750 మంది విద్యార్థులు మాస్టర్ డిగ్రీలు పొందుతున్నారు. ఇందులో ఎంబీఏ, ఎంసీఏ, మైక్రోబయోలజీ, కెమిస్ట్రీ వంటి డిపార్ట్మెంట్ల వారితోపాటు ముఖ్యంగా బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ వంటి కోర్సులు చదివినవారు ఉన్నారు. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన లా కళాశాల, ఇంజినీరింగ్లో మూడు డిపార్ట్మెంట్ల విద్యార్థులు ఉన్న నేపథ్యంలో కార్యక్రమానికి పలు ప్రైవేటు కంపెనీలు వచ్చి.. పీయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసేందుకు ఒప్పందాలు చేసుకోనున్నారు.
నేషనల్ సెమినార్ను ఘనంగా నిర్వహించేందుకు యూనివర్సిటీ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో చీఫ్ కన్వీనర్గా రిజిస్ట్రార్ రమేష్బాబు, కన్వీనర్లుగా వీసీ ఓఎస్డీ మధుసూదన్రెడ్డి, కంట్రోలర్ ప్రవీణ వ్యవహరిస్తున్నారు. కమిటీల్లో వివిధ స్థాయిల్లో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే అతిథులకు కన్హా శాంతివనంలోనే రెండు రోజుల కోసం వసతి ఏర్పాటు చేయనున్నారు. రెండోరోజు యూనివర్సిటీలో నిర్వహించే కార్యక్రమానికి మూడు బస్సుల్లో వివిధ యూనివర్సిటీల వీసీలను తీసుకురానున్నారు. ఎయిర్ పోర్టు, బస్టాండ్, రైల్వేస్టేషన్స్ నుంచి వచ్చే అతిథులను ప్రత్యేక వాహనాల ద్వారా శాంతివనానికి తరలించనున్నారు.
పీయూ ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ మొదటిరోజు కన్హా శాంతివనంలో ప్రారంభం కాగా.. రెండోరోజు పీయూలో పలు సెషన్లు నిర్వహించి.. అనంతరం సాయంత్రం ముగింపు కార్యక్రమం శాంతి వనంలోనే చేపడుతాం. పీయూకు ఈ అవకాశం రావడం గొప్ప విషయం. యూనివర్సిటీ గొప్పతనం చాటేలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, వీసీలు హాజరుకానున్నారు.
– రమేష్బాబు, రిజిస్ట్రార్, పీయూ
పీయూకు దక్కిన అరుదైన అవకాశంతో యూనివర్సిటీ గొప్పతనం చాటేలా జాతీయ సెమినార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా యూనివర్సిటీకి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. వచ్చిన అతిథులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. అందరి సహకారంతో శాంతివనం, పీయూలో నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేస్తాం.
– మధుసూదన్రెడ్డి, సెమినార్ కన్వీనర్


