వనపర్తి: అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు సత్వర ఫలితాలు అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జెడ్పీ సీఈఓ యాదయ్యతో కలిసి ఎంపీడీఓలతో సమీక్ష నిర్వహించి ఫాంపాండ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్), ఉపాధి కూలీల సమీకరణ, జలసిరి పనుల పురోగతి తదితర అంశాలపై చర్చించారు. వీబీజీ రాంజీ పథకంలో భాగంగా గ్రామాల్లో నిర్మిస్తున్న ఫాంపాండ్ల నిర్మాణాలను లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి లబ్ధిదారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. ఎన్ఎఫ్బీఎస్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ఉపాధి కూలీల సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జలసిరి పనులు నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని కోరారు. నిర్లక్ష్యానికి తావులేకుండా పని చేసి ప్రతి కార్యక్రమంలో ఆశించిన పురోగతి సాధించాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘునాథ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


