వనపర్తి: భూ భారతి విధానంలో భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జూనియర్ అసిస్టెంట్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై జిల్లాలోని వివిధ మండలాల జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరై మాట్లాడారు. రెవెన్యూశాఖలో భూ భారతి అత్యంత కీలకమైందని, రైతులు, ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. లక్ష్య సాధనలో జూనియర్ అసిస్టెంట్ల పాత్ర ఎంతో ముఖ్యమైందని.. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, డిజిటల్ సంతకాలు, సంబంధిత పత్రాల పరిశీలన తదితర ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు. సాంకేతిక లోపాలకు తావులేకుండా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలిస్తూ లాగిన్ ప్రక్రియ నుంచి దరఖాస్తుల ఆమోదం వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, శిక్షణలోనే సందేహాలను మాస్టర్ ట్రైనర్ల ద్వారా వెంటనే నివృత్తి చేసుకోవాలన్నారు. శిక్షణలో కలెక్టరేట్ పరిపాలనాధికారి భానుప్రకాష్ , మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.


