వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 22 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ సునీతారెడ్డికి వివరించి.. వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను నేరుగా విని, తక్షణ పరిష్కారం చూపడం పోలీసుశాఖ ప్రధాన బాధ్యత అన్నారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి.. సంబంధిత అధికారుల సమన్వయంతో చట్టబద్ధంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని అన్నారు.
రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్రం
అమరచింత: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. అమరచింతలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు లొంగిపోయి.. వ్యవసాయ ఉత్పత్తులను జీరో ట్యాక్స్తో దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించడం దారుణమన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించి.. పారిశ్రామిక యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం దుర్మార్గమన్నారు. కార్మికుల ప్రయోజనాలను దెబ్బకొట్టి.. పెట్టుబడిదారుల ఖజానా నింపడమే ప్రధాని మోదీ తన కార్తవ్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 10న దేశవ్యాప్తంగా చేపట్టనున్న జైల్భరో కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్ఎన్ రమేశ్, రైతు సంఘం జిల్లా కోశాధికారి వెంకటేశ్, ప్రభాకర్, బుచ్చన్న, నాగేంద్రమ్మ, శంకర్, రాజు, మోహన్, భగవంతు, హరికృష్ణ, రేణుక ఉన్నారు.


