వనపర్తి: ఇక నుంచి కాగిత రహిత పాలన సాగిద్దామని.. జిల్లాలోని అన్ని కార్యాలయాలు ఈ–ఆఫీస్ ద్వారా మాత్రమే దస్త్రాలు పంపించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలతో సంక్షేమ పథకాల పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా భూ భారతి రికార్డులు ఈ–ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సమీక్షిస్తూ ప్రభుత్వం గుడిసెల్లో ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని.. సర్వే చేయించి త్వరగా నివేదిక ఇస్తే అనుమతుల ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పనులు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇంటి నిర్మాణం చేపట్టే విధంగా చూడాలని, అవసరమైన వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని సూచించారు. ఎస్ఐఆర్ గడువు మరో మూడురోజులు మాత్రమే ఉందని.. పెండింగ్లో ఉన్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక్క ఓటరు నుంచి కూడా ఫిర్యాదు రావద్దని హెచ్చరించారు. అదేవిధంగా భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. తహసీల్దార్ వారీగా పెండింగ్లో ఉన్న భూ భారతి ఫైళ్లపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 7లోగా అన్ని పూర్తి కావాలని సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు వీబీజీ రాంజీ పథకం కింద అన్ని మండలాల్లో నీటికుంటల ఏర్పాటుకు స్థలం చూసి పనులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. జిల్లాలో 222 నీటి కుంటలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్కుమార్, డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఓ రఘునాథ్రెడ్డి, డిప్యూటీ సీఈఓ రాంమహేశ్వర్రెడ్డి, హౌసింగ్ పీడీ విఠోబా పాల్గొన్నారు.


