కొత్తకోట రూరల్: కొత్తకోట సమీపంలోని వెంకటగిరి క్షేత్రంలో వెలిసిన భూలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి శ్రావణ నక్షత్ర శతమాస కల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు విష్ణునారాయణస్వామి, కన్నయ్యస్వామి, సింగారాచార్యుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ కల్యాణ క్రతువు కనులపండువగా సాగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి గర్భగుడి నుంచి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు జీలకర్ర–బెల్లం, మంగళసూత్ర ధారణ తదితర సంప్రదాయ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి కొత్తకోటతో పాటు పరిసర గ్రామాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్యక్రమ అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాసులు, నరోత్తంరెడ్డి, వెంకటేష్, ఎన్.శ్రీనివారెడ్డి, మోహన్యాదవ్, మేడిశెట్టి జ్యోతి, ప్రసన్నలక్ష్మి, బీమా రజిని, రాణి, అనిత, విజయలక్ష్మి, రాజేశ్వరి, వసంత తదితరులు పాల్గొన్నారు.


