
చట్టాలపై అవగాహన ఉండాలి
పాన్గల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమయం వృథా చేయకుండా చదివితే తప్పక విజయం లభిస్తుందన్నారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం చెల్లవని.. పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదవుతుందని తెలిపారు. భారత న్యాయ సంహిత, వినియోగదారులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వెహికల్, సైబర్ చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్లైన్ నంబర్ 15100 సంప్రదించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉన్న విద్యార్థినికి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉత్తరయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రఘు, ఎస్ఓ హేమలత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.