–8లో
పిడుగు పడి కుప్పకూలిన మహిళలు
వరి చేనులో కలుపుతీతకు వెళ్లిన మహిళలను మృత్యువు కాటేసింది. పిడుగు రూపంలో ప్రాణాలు తీసింది. కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది.
జిల్లా కమిటీ ఏకగ్రీవం
ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
విజయనగరం రూరల్:
వైఎస్సార్సీపీ ప్రతీ కార్యకర్త ఒక నాయకుడని, ప్రజల్లో వారి మాటకే విలువని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలోని ఓ ప్రైవేటు కన్వెన్షన్లో శనివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు సర్కారు అరాచకాలపై ప్రతీ కార్యకర్త ధైర్యంగా పోరాడాలని, ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. 2029లో మన ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని, మన ప్రభుత్వంలో ప్రతీ కార్యకర్త భాగస్వాములు అవుతారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం పట్టదని, ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికీ తోచినంతలో వారు దోచేస్తున్నారని విమర్శించారు. బాధ్యత, పదవులు, అధికారం శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యమన్నారు. జిల్లాలో వైద్య కళాశాల, జేఎన్టీయూ జీవీ, గిరిజన విశ్వవిద్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, విజయనగరంలో డిగ్రీ కళాశాల ఎవరి హయాంలో ఏర్పడ్డాయో ప్రజలకు తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలలు సుందరంగా తీర్చిదిద్దబడ్డాయని, భోగాపురం ఎయిర్ఫోర్టు శంకుస్థాపన, నిర్మాణానికి అంకురార్పణ జరిగిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండడం దురదృష్టకరమని, అధికారం వచ్చిందంటే ప్రజలకు మంచి జరగాలేకాని, వారి ఉసురు తీయరాదన్నారు. సమస్యలు గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు దోచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి హయాంలో పేద ప్రజల సంక్షేమానికి సుమారు వంద పథకాలు అమలు చేశారన్నారు. కరువు పరిస్థితులపై జగన్మోహన్రెడ్డి సమావేశం పెడితేగాని కరువు మండలాలు ప్రకటించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎల్నినో కాదని ‘ఎల్లో’నినో వైఫల్యంతోనే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ఎటువంటి ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే కారణమన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలుగా అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులు, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యకర్తలకు స్థాయి కల్పించే బాధ్యత పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకుంటారన్నారు. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని, కార్యకర్తలు అధైర్యపడొద్దని, మీ వెనుక మేముంటామని అన్నారు. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయన్నారు.
● కండువా కప్పుకుంటే చాలా..
నిన్నటి వరకు దోపిడీదారులు, దొంగలు, దగాకోరులు అన్నవారే పార్టీ కండువా కప్పుకోగానే రుషులైపోయారా అని బొత్స ప్రశ్నించారు. అధికారం లేదని పార్టీని వీడడం కాదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామన్నదే ముఖ్యమన్నారు. ఈ రెండున్నరేళ్లలో జిల్లాలో గాని, విజయనగరం నియోజకవర్గంలో గాని ఏమి అభివృద్ధి చేశారా చెప్పగలరా అని ప్రశ్నించారు. కోలగట్ల వీరభద్రస్వామి హయాంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే, నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. విజయనగరం శివారు జమ్ము కోమటిచెరువును ప్రజల ఆరోగ్యార్థం వాకింగ్ ట్రాక్గా నాడు అభివృద్ధి చేస్తే నేడు అక్కడ చెత్తలతో నిండిపోయిందని అన్నారు. రోగులు వైద్య సేవల కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్తే.. వారిని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లమని చెప్పే సంఘటనలు ఎల్లో మీడియాలోనే రావడం ఈ ప్రభుత్వ పాలనకు నిదర్శనాలన్నారు. చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు గుర్తు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
● యువనాయకుడు బొత్స సందీప్ మాట్లాడుతూ 2.0లో కార్యకర్తలే క్రియాశీలకంగా ఉంటారని పార్టీ అధినేత జగనన్న చెప్పారన్నారు. చంద్రబాబు సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీని నెరవేర్చలేదని, దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
● విజయనగరం కార్పోరేషన్ మాజీ మేయర్ వి.విజయలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిందని, ముఖ్యంగా మహిళలకు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదన్నారు.
● పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ చంద్రబాబు సర్కారును ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయడం తప్ప, ప్రజలకు మంచి చేద్దామన్న ఆలోచన లేదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని చంద్రబాబు సర్కారు గుర్తుంచుకోవాలన్నారు. ఏఒక్క ఆడబిడ్డకు నెలకు ఇస్తామన్న రూ. 1500లు పథకం నేటికి అమలు చేయలేదన్నారు. ఉచిత బస్సు పథకం పెట్టి ఉన్న బస్సులు తగ్గించడంతో మహిళలు ప్రశాంతంగా బస్సులో ప్రయాణించే అవకాశం లేకపోతోందన్నారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీ ఏమైందో టీడీపీ నాయకులే చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ ఉద్యోగులు, పింఛన్దారుల విభాగం జిల్లా అధ్యక్షుడు డోల మన్మథకుమార్, విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ పట్టణ, మండలాధ్యక్షులు ఆశపు వేణు, కెల్ల త్రినాథ్, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ కార్పోరేటర్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చంద్రబాబుది అంతా అబద్ధాల పాలన. ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చారు. మహిళల రుణాలకు సున్నావడ్డీ పథకం తీసేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఉత్త గ్యాసేనని తేలిపోయింది. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి కల్పన కలగానే మిగిలిపోయింది. అక్కా చెల్లెళ్లకు ఆడబిడ్డ నిధికింద ఇస్తామన్న నెలకు రూ.15 వందలు ఇవ్వడంలేదు. వీటిని జనంలోకి తీసుకెళ్లాలి. చంద్రబాబు మోసపూరిత పాలన వివరించి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలి.
– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ముందున్నవన్నీ మంచిరోజులే..
ముందున్నవన్నీ వైఎస్సార్సీపీకి మంచిరోజులే. ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల విజయానికి కృషిచేయాలి. కార్యకర్తలందరూ సముచిత స్థానం లభిస్తుంది. కలిసికట్టుగా ముందుకు సాగుదాం. నేడు జిల్లా కేంద్రంలో నీటి కొరత లేదంటే కోలగట్ల వీరభద్రస్వామి ముందుచూపుతో చేసిన పనులే కారణం. పక్కనున్న విశాఖలో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు.
– పెనుమత్స సురేష్బాబు, ఎమ్మెల్సీ
స్థానిక ఎన్నికల్లో సంఘటితంగా పనిచేయాలి
చంద్రబాబు సర్కారు అరాచకాలకు ఎదురొడ్డి పోరాడుదాం
మీ వెనుక మేముంటాం
టీడీపీ వెన్నపోటు పార్టీ
దోపిడీదారులు, దగాకోరులు పార్టీలో చేరగానే రుషులైపోయారా?
శాసనమండలి విపక్ష నేత
బొత్స సత్యనారాయణ
వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు దిట్ట
వెన్నుపోటు పార్టీకి నాయకుడు చంద్రబాబు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన నేర్పరి.. ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో ఆశ్చర్యంలేదు. సూపర్ సిక్స్ అంటూ నమ్మించి జనాన్ని ముంచేశారు. నిత్యావసర ధరలు భగ్గుమంటున్నా పట్టించుకోవడంలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గంలో సువిశాలౖమైన రోడ్లు, రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మహిళలకు ప్రత్యేక పార్కు, స్విమ్మింగ్ పూల్, ఇది మన విజయనగరం అని చెప్పుకునేలా ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలిసిందే.
– కోలగట్ల వీరభద్రస్వామి,
మాజీ డిప్యూటీ స్పీకర్


