● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్లను పరిశీలించి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులకే మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెబెక్స్లో అధికారులతో శనివారం మాట్లాడారు. జిల్లాలో పింఛన్ల కోసం 51,722 దరఖాస్తులు ఆన్లైన్లో నమోదయ్యాయన్నారు. ఒంటరి మహిళల కేటగిరీలో పింఛన్ పొందేందుకు చట్టబద్ధమైన విడాకుల ధ్రువీకరణ తప్పనిసరిగా ఉండాలన్నారు. 21వ తేదీలోగా దరఖాస్తుల భౌతిక పరిశీలన పూర్తి చేసి 24వ తేదీలోగా తదుపరి పక్రియను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్పాణి, తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
● జెడ్పీ సీఈఓ లవరాజు
విజయనగరం రూరల్: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురించినట్టు జెడ్పీ సీఈఓ లవరాజు శనివారం తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ మేరకు జిల్లాలోని 27 మండలాల్లో మొత్తం 1586 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తూ తుది జాబితాను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ జాబితాను కలెక్టరేట్, జెడ్పీ, మండల కార్యాలయాల్లో ప్రచురించామన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తిచేసి ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీఈఓ లవరాజు తెలిపారు.
చెరకు రైతులకు భరోసా ఇవ్వాలి
● 28న చెరకు రైతుల ర్యాలీ
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగార యాజమాన్యం చెరకు రైతులకు భరోసా ఇవ్వాలని సంకిలి సుగర్ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి, రైతులు డిమాండ్ చేశారు. రేగిడిలో చెరకు రైతులు శనివారం సమావేశమయ్యారు. కర్మాగారం పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. చక్కెర కర్మాగారాన్ని మూసివేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో భాగంగా ఈ నెల 28న సంకిలి శివాలయం నుంచి చక్కెర కర్మాగారం వరకు చెరకు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి దశల వారీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో చెరకు రైతులు కిమిడి సూరపునాయుడు, వీరఘట్టం, పాలకొండ, రేగిడి, బొబ్బిలి, వంగర మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.


