ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం..
అప్గ్రేడ్ పాఠశాలల్లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం. ఏఏ వసతులు అవసరమో హెచ్ఎంలను అడిగి తీసుకున్నాం. విద్యాబోధనకు ఇబ్బంది లేదు. ఇటీవల ఉపాధ్యాయులకు నిర్వహించిన సర్దుబాటు ప్రక్రియలో ఉపాధ్యాయల కొరత లేకుండా సర్దుబాటు చేశాం.
– కె.మోహనరావు, డిప్యూటీ ఈవో, బొబ్బిలి
త్వరలో ఆయా పోస్టుల భర్తీ..
చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్న మాట వాస్తవమే. భవనాల నిర్మాణాలకు పలు ప్రాంతాల్లో స్థలాలు లేకపోవడం సమస్యగా మారింది. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. స్థలాలు గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు. ఖాళీ పోస్టులను నోటిఫకేషన్ ద్వారా భర్తీ అయ్యే అవకాశం ఉంది.
– కె.వి.బాలామణి, ఐసీడీఎస్ పీడీ, విజయనగరం
రామభద్రపురం:
సర్కారు బడులు, అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. సరైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చిన్నారులకు శాపంగా మారింది. ఇరుకు గదులు, చాలీచాలని వసతుల నడుమ విద్యాభ్యాసనకు ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు, సరిపడా మరుగు దొడ్లు లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం సౌకర్యాల కల్పనను మరిచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’ పనులను నిలిపివేయడంతో భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.
ఇదీ పరిస్థితి...
జిల్లాలో గతేడాది 25 ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రభుత్వం ఉన్నత పాఠశాలలుగా స్థాయి పెంచింది. ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడంపై శ్రద్ధచూపలేదు. కనీసం ఆ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తిచేయలేదు. మరుగు దొడ్లను నిర్మించలేదు. టీచించిన్, నాన్టీచింగ్ పోస్టుల భర్తీపైనా దృష్టిసారించలేదు. ఫలితం... వరండాలు, చెట్ల నీడలో విద్యార్థులు చదువులు సాగిస్తున్నారు. బోధనకు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. స్థాయి పెంచి సౌకర్యాలు కల్పించకపోవడంపై విద్యావర్గాలు మండిపడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతనే లేదని విద్యార్థుల తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు. పేద కుటుంబాల పిల్లల చదువులపై శ్రద్ధ చూపకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఇరుకు గదుల్లో ఉక్కిరిబిక్కిరి...
జిల్లాలో 181 మినీ అంగన్డీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. వీటిలో చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. రెండేళ్లుగా భవన నిర్మాణాలపై దృష్టిపెట్టని దుస్థితి. ఆటపాటలతో చక్కగా సాగాల్సిన బాలబడులు అసౌకర్యాల నడుమ, చాలీచాలని వసతుల నడుమ సాగుతున్నాయి.
జిల్లాలో 25 యూపీ స్కూల్స్ను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించిన
అధికారులు
181 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా స్థాయి పెంపు
పాఠశాలల్లో కరువైన మౌలికవసతులు
వరండాలే తరగతి గదులు
భర్తీకాని టీచింగ్, నాన్టీచింగ్ పోస్టులు
విద్యార్థులకు తప్పని కష్టాలు
స్పందించని పాలకులు, అధికారులు


