బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 22న 330 మంది జానపద కళాకారులతో నృత్యాలు, ర్యాలీ ప్రదర్శనను జీనియస్ బుక్, గోల్డెన్ బుక్లు గుర్తించాయి. గిన్నిస్బుక్ రికార్డు ప్రదర్శనకు అర్హత పత్రాలు అందజేశాయి. దీనిపై కళాకారులు కోల బలరాం, మరిపి శంకరరావు, చుక్క కూరనా యుడు, బి.మధుసూదనరావు, గొట్టాపు సన్యాసినాయుడు, తెర్లి పద్మ, పి. సత్యం, ఎం.రమేష్ హర్షం వ్యక్తంచేశారు. సర్టిఫికెట్లను ఎమ్మెల్యే బేబినాయనకు సోమవారం అందజేశారు.
నేడు రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుని రాక
విజయనగరం టౌన్: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి.త్రివిక్రమరావు ఈ నెల 25న మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారని తెలుగు భాషా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని 25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సన్ స్కూల్లో నిర్వహిస్తున్న ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
● ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి వెంకటరమణ
విజయనగరం ఫోర్ట్: డైరెక్టర్ ఆఫ్ మెడికల్హెల్త్ (డీఎంఈ), డైరెక్టర్ ఆఫ్ సెకెండరీ హెల్త్ (డీఎస్హెచ్), డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్)లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ మెడికల్, హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు వినతిపత్రం అందజేశారు. రెగ్యులరైజేషన్ పక్రియ పూర్తయ్యేవరకు కాంట్రాక్టు ఉద్యోగులకు 100 శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రతి కాంట్రాక్టు ఉద్యోగికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఈపీఎఫ్ సౌకర్యం, అనార్యోగానికి గురైన ఉద్యోగులకు పూర్తిజీతంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు గోవింద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
27న గిరిజన వర్సిటీలో తెలుగు భాషాదినోత్సవం
విజయనగరం రూరల్: తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ఇన్చార్జి వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణ సమితితో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉత్సవానికి ముఖ్య అతిథిగా కళారత్న పురస్కార గ్రహీత, రాష్ట్ర సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు కత్తిమండ ప్రతాప్కుమార్, గౌరవ అతిథిగా తెలంగాణాకు చెందిన సామాజిక కార్యకర్త గుంత లక్ష్మణ్ హాజరవుతారని పేర్కొన్నారు. వర్సిటీలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆహ్వాన ప్రతులను, ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్పర్సన్ పరికిపండ్ల శ్రీదేవి, గ్రంథాలయ అధికారి కొల్లె శంకర్ రెడ్డి, కార్యక్రమ సమన్వయకర్త ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ, సభ్యులు మన్నాల ప్రసాద్, సహాయ గ్రంథాలయాధికారి దాసరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.


